Wednesday, February 29, 2012

చెప్పు



చెప్పులమ్మ చెప్పులు, చక్కని చెప్పులు
హాయినిచ్చే చెప్పులు, హవాయి చెప్పులు
మెత్తనైన చెప్పులు, ఎత్తైన చెప్పులు
బరువు మోసే చెప్పులు, బుద్ధి చెప్పే చెప్పులు
గొడుగై కాచే చెప్పులు, గట్టివైన చెప్పులు
రక్షించే చెప్పులు, రాజ్యమేలే చెప్పులు
సేదతీరే పాదాలకు సర్కారీ చెప్పులు

చెప్పులు, పాదరక్షలు, జోళ్ళు, పాదుకలు, పావుకోళ్ళు, ఎన్నో ఎన్నెన్నో... పొద్దు పొద్దున్నే ఈ చెప్పుల గోలేమిటి అనుకుంటున్నారా? అయ్యో అలా అనేసుకుంటే ఎలా? అసలు చెప్పులకున్న విలువేమిటో మీకు తెలుసా?అది తెలియాలంటే (తెలుసుకోవాలని లేదు అన్నా సరే) ఈ సుత్తి భరించక తప్పదు. ఒకప్పుడు అంటే చెప్పులు లేని రోజుల్లో ఎలా ఉన్నారో కాని ఈ కాలంలో అయితే చెప్పులు అనేవి మన అవసర వస్తువుల చెంతన చేరిపోయాయి. ఊరంతా తిరిగి మూల కుర్చునేవి చెప్పులు అని చెప్పినా ఈ కాలంలో మాత్రం ఊరుతో పాటు ఇల్లంతా కూడా కలియ తిరిగేస్తున్నాయి. నిద్ర లేచి కాలు కింద పెట్టింది మొదలు పడుకునే దాకా వాటితో మన పాదాలకి విడతీయలేని బంధం ఏర్పడిపోయింది (కేవలం విదేశాల వాళ్ళకే అనుకుంటే పొరపాటే స్వదేశీయులు కూడా నేర్చారు). అంతలా మన రోజువారీ జీవితంలో ఇమిడిపోయాయి అంటే అతిశయోక్తి కాదు.

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవి అన్న పాట విన్నప్పుడు చెప్పులు పోతే ఇంత హడావిడి చేస్తూ పాట పాడాలా అనుకునేదానిని. కాని ఒకసారి ఊహించండి మనం అతి ముఖ్యమయిన పని మీద హడావిడిగా వెళ్తున్నాం. సరిగ్గా అదే సమయంలో చెప్పులు తెగిపోయాయి ఏం చేస్తారు?ఏముంది ఎంచక్కగా పిన్నీసు తీసేసి పెట్టేసుకుంటాం అంటారా? దరిద్రం పుచ్చి అది కూడా పోయిందనుకోండి పైగా ఎండా కాలం అనుకోండి అప్పుడు తెలుస్తుంది చెప్పుల విలువ. హమ్మయ్యా చెప్పుల గురించి బాదుడు అయిపోయింది! ఇహ వాని గొప్పతనం చెప్పడానికి ఈ టపా చాలదు కాని ముఖ్యమయినవి మాత్రం చెప్తాను.

చెప్పులు - పద్మాలు:
పద్మపాదాచార్యుల వారి గురించి అందరూ వినే ఉంటారు. ఈయన శంకరాచార్యుల వారి ప్రియ శిష్యుడు. ఈయననే ఎందుకని ప్రియ శిష్యునిగా స్వీకరించారు అని మిగతా శిష్యులు ఆయనను ప్రశ్నించేవారు. ఒకనాడు ఆయన నదికి అవతలి ఒడ్డున ఉండగా ఇవతలి ఒడ్డున ఉన్న ఆయన శిష్యులందరినీ పిలువగా గురువుగారు పిలిచిన వెంటనే వెళ్ళాలనే తలపుతో నది ఉన్నదన్న విషయం కూడా గమనించక నది మధ్యనుంది వెళ్ళటం మొదలుపెట్టగా ఆయన మునగకుండా, నదిలోవి ఏవీ ఆయనకు గుచ్చుకోకుండా ఆయన పాదాలకు ఆలంబనగా పద్మాలన్నీ ఆయన పాదాల కిందకి వచ్చి ఆయనను గురువు వద్దకు చేర్చాయిట. మిగతా శిష్యులు మాత్రం చుట్టుతిరిగి వెళ్ళారుట. ఈయనలో ఉన్న గురుభక్తి కారణంగానే ఈయన ప్రియ శిష్యుడు అయ్యాడనీ, ఆ రోజు నుండే ఈయనకి పద్మపాదులు అని పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఈయన పాదాలకి పద్మాలు పాదరక్షలుగా నిలవటం.

చెప్పులు - రాజ్యపాలన:
రామాయణంలో పాదుకా పట్టాభిషేక ఘట్టం అందరికీ తెలిసినదే కదా! ఒకసారి శ్రీమహావిష్ణువు కిరీటం ఆయన శిరస్సు మీద ఉంటాననే గర్వంతో ఆయన పాదుకలతో నువ్వు కాళ్ళ కింద నలుగుతూ ఉంటావు అని హేళన చేసిందిట. అప్పుడు ఆ పాదుకలు శ్రీ హరితో మొరపెట్టుకున్నాయిట మాకు కూడా మంచి స్థానం కావాలి అందరికీ గౌరవంగా ఉండాలి అని. అప్పుడు ఆ శ్రీహరి ఐతే మీకు వరమిస్తున్నాను. రామావతారంలో మీరు కూడా ఆ కిరీట స్థానాన్ని పొంది (భరతుడు తన శిరస్సు మీద పెట్టుకుని తీసుకెళతాడు కదా!) సింహాసనాన్ని అధిరోహించి రాజ్యపాలన చేస్తారు అని. అలా చెప్పులు రాజ్యాన్ని కూడా పాలించాయి. 


చెప్పులు - కళ:
ఇంద్రజాలము, మహేంద్రజాలము లాగానే తలచిన చోట ఉండే కళని పాదుకాసిద్ధి అంటారు. ఇది మనకున్న చతుష్షష్ఠి కళలలో ఒకటి. మనం విఠాలాచార్య గారి జానపద చిత్రాలలో గమనిస్తే చెప్పులు దొరుకుతాయి అవి వేసుకుని కళ్ళు మూసుకుని ఫలానా చోటికి వెళ్ళాలి అనుకోగానే అవి తీసుకుని వెళతాయి. లేదా అవి వేసుకుని మనం ఎవరికీ కనిపించకూడదు అని అనుకుంటే కనిపించం ఇదే పాదుకాసిద్ధి కళ. సులోచన అనే యక్షినిని ప్రసన్నం చేసుకోగలిగితే మనకి ఈ పాదుకాసిద్ధి లభిస్తుందని ఉద్దమారేశ్వర తంత్రంలో చెప్పబడింది.
చెప్పులు - ఋణం: దీనికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అది:
భోజుని ధారానగరంలో దాసు అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడుట. అతను సంతాన లేమితో బాధపడుతూ సంతానం కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, చేతనయినవన్నీ చేశాడు. కానీ ప్రయోజనం లేదు. ఒకసారి మహాపండితుడు దేవాలయంలో దేవుడి గురించి ఉపన్యాసం ఇస్తుంటే విని సంతోషించి ఉపన్యాసం అయిన తరువాత ఆయనని తనకు సంతానం కలిగే మార్గం చెప్పమని ప్రాధేయ పడతాడు. ఆయన ఆలోచిస్తున్న సమయంలోనే అక్కడకి ఒక యోగి దైవదర్శనం కోసం రావటాన్ని గమనించి, దాసుకి ఆ యోగిని చూపించి "ఈయన న ప్రతి గ్రహీత - అంటే ఎవరి దగ్గరా ఏమీ తీసుకోనివాడు కనుక ఈయన నీకు బాకీ పడేలా చేసుకో. అప్పుడు నీకు పుత్రుడు తప్పక పుడతాడు" అని చెప్పి ఆయన వెళిపోతారు. అది విన్న దాసు దీర్ఘాలోచనలో పడతాడు. ఎప్పుడూ ఎవ్వరి దగ్గరా ఏదీ తీసుకోని ఈయనకి నేనేమి ఇవ్వగలను? పైగా ఆయనే కనుక నాకు ఫలానాది కావాలి అంటే అది తెచ్చి ఇచ్చే ఆర్ధిక స్థితి మాత్రం నాకెక్కడ ఉంది? అనుకుంటూ దివ్యమయిన తేజస్సు కల ఆ యోగికి నమస్కరించాడు. ఆయన ఒక క్షణం అలా తలెత్తి చిరునవ్వు నవ్వి, చేయెత్తి ఆశీర్వదించినట్లుగా చూసి వెళిపోయారు.

ఆ యోగి ఉండే ఆశ్రమం, ఆయన స్నానం చేసే సమయం, స్నానాల రేవు, భోజన సమయం, తినే పండ్లు ఉండే వనం, ఇలా ప్రతీదానినీ పరిశీలించి తనకి ఆయన ఎలా ఋణగ్రస్తుడవుతాడా? అని ఆలోచిస్తుంటే మంచి ఉపాయం తట్టిన దాసు వెంటనే నైపుణ్యమున్న తన వృత్తిలో చక్కని, నాలుగు చెప్పుల జతలను కుట్టి, యోగి ఆశ్రమం నుండి స్నానానికి వెళ్ళే త్రోవలో అక్కడక్కడ ఒక్కో జత చొప్పున నాలుగు చోట్ల ఉంచాడు. 

అది మంచి ఎండాకాలం. మధ్యాహ్నం వేళ చండ్ర నిప్పులని కురిపిస్తూ సూర్యుడున్న వేళ, యోగి తన మధ్యాహ్న స్నానానికి బయలుదేరతాడు. తలపై గొడుగూ, కాళ్ళకి చెప్పులూ ధరించే అలవాటే లేని ఆయన వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ కూడా ఆ చెప్పుల జత వైపు చూపుని కూడా ప్రసరింప చేయలేదు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న దాసు నిరాశ పడ్డాడు. అయినా సరే పట్టు వదలకుండా రెండవ రోజు కూడా అలానే చెప్పులని ఉంచాడు. ఈ సారి యోగి స్నానానికి వెళ్ళేటప్పుడు చూడలేదు కాని వచ్చే సమయంలో మాత్రం కాళ్ళు మాడిపోతుంటే చెప్పుల వంక చూసుకుంటూ ఆశ్రమానికి వెళిపోయాడు. అది గమనించిన దాసు ఈ మాత్రం మార్పు వచ్చినదని సంతోషిస్తాడు. మూడవ రోజున కూడా ఇలానే చేస్తాడు దాసు. ఈ రోజు వెళ్ళేటప్పుడు కూడా చెప్పులని పరీక్షిస్తూ వెళ్లి వచ్చేటప్పుడు మూడు చెప్పుల జతలను దాటి, ఎండ ధాటికి ఆగలేక కాళ్ళు విపరీతంగా మాడిపోతుంటే తట్టుకోలేక నాల్గవ చెప్పుల జతలో కాళ్ళు పెట్టి క్షణం నిలబడి, కాళ్ళు మాడటం నుండి కొంత ఉపశమనం పొందాక మళ్ళీ వట్టి కాళ్ళతో నడుచుకుని ఆశ్రమానికి వెళిపోతాడు. నాల్గవ రోజు ఎండ మరింత ఎక్కువ కావడంతో యోగి వెళ్ళేటప్పుడు ఎలాగో వెళ్ళినా వచ్చేటప్పుడు మాత్రం వట్టి కాళ్ళతో రాలేక చెప్పుల జతని ధరించి ఆశ్రమానికి వెళతాడు. ఆ చెప్పులెవరివో తనకి తెలియదు. అక్కడ వాటిని ఎవరు పెట్టారో కూడా తెలియదు. ఏదీ పుచ్చుకోని తను ఈ విధంగా ఋణగ్రస్తుడు కావలసి వచ్చిందే అని ఎంతో బాధపడతాడు. అయినా విధిలేక రోజూ ఆ చెప్పులని వాడటం ప్రారంభించాడు యోగి. చెప్పులే లేని కాలంలో ఇంతకుమించిన ఎండణి సైతం లెక్క చేయకుండా తాను ఎలా వెళ్ళగలిగేవాడో బోధపడలేదు కాని అవకాశం ఉంటే కావాలనుకున్న వస్తువు మీదకి ఆలోచన పోతుంది అనే క్రొత్త విషయాన్ని గ్రహించాను కాని ఈ చెప్పుల కారణంగా తాను ఒక వ్యక్తికి బాకీ పడ్డానే అని ఎంతో బాధపడ్డాడు ఆ యోగి.

ఇది జరిగిన కొన్నాళ్ళకి యోగి మరణించడం, దాసుకి పుత్రుడు పుట్టడంతో ఈ కథ అంతా తన భార్యకి చెప్పి మనకి ఋణపడ్డ ఆ యోగి మనకి బిడ్డగా జన్మించాడు కనుక ఎటువంటి పరిస్థితులలోనూ ఆ పిల్లవాని దగ్గర నుంచి ఏదీ తీసుకోకు తీసుకున్నట్లయితే ఆయన ఋణం తీరిపోయి మనకి ప్రమాదం జరగవచ్చు అని చెప్తాడు. ఆ రోజు నుండి దాసు, అతని భార్య ఈ బాబుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. భోజుని ద్వారం వద్ద కాపలా ఉద్యోగిగా ఉండే దాసుతో వెళ్ళే అతని కొడుకుకి కూడా ఆస్థానంలో కవిత్వం విని విని అయిదవ ఏటనే సంస్కృత కవిత్వం వచ్చింది.
నగరములోని ప్రధాన కూడలిలో ఉండే పెద్ద గంటని తాడుతో లాగి నగరంలో దొంగలు పడవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని రాత్రి ప్రతీ ఝాములోనూ హెచ్చరిక చేసే ఉద్యోగం దాసు భార్యది. మూడు గంటల కాలం ఒక ఝాము కనుక రాత్రికి నాలుగు ఝాములు ఉంటాయి. ఈమె బాగా అలసిపోవటం వలన నిదుర పెట్టేయగా ఈ పిల్లవాడు ఆ గంటని ప్రతీ ఝాములోనూ లాగుతూ నాలుగు ఝాములకి నాలుగు పద్యాల ద్వారా హెచ్చరిక చేస్తాడు.

మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరాః
అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జ్జాగ్రత జాగ్రత!

అంటే ఈమె నా తల్లి, ఇతడు నా తండ్రి, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా సహోదరులు అనుకోవడం అంతా ఒక కల్ల. వీళ్ళు ప్రతీ జన్మలోనూ మారతారు. అలానే ఈ ఇల్లు నాది, ఈ ధనం నాది అనుకోవడం కూడా భ్రమే. నీ ముందు ఇవన్నీ వేరొకరివి, నీ తరువాత మరొకరివి కనుక ఈ వేదాంతాన్ని తెలుసుకుని జాగ్రత్త పడాలి కాని నగరంలోని దొంగలొక దొంగలా? శరీరంలో ఉండే మమ(నేను, నాది) అనే దొంగకి మాత్రమే భయపడాలి అని అర్థం.

ఆశయా బధ్యతే లోకః కర్మణా బహు చింతయా
ఆయుఃక్షీణం న జానాతి తస్మా జ్జాగ్రత జాగ్రత!

అంటే ఏవో కోరికలూ, అవి తీరలేదని చింతలూ... వీటి వలన దుఃఖంతోనే ప్రతీ వ్యక్తీ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ కోరిక వలనే ఆయుష్యం క్షీణిస్తోంది అని తెలుసుకోలేకపోతున్నారు కనుక కోరికలను తగ్గించుకుని ఆయుష్షు తరిగిపోతోందనే సత్యాన్ని తెలుసుకుని జాగ్రత అనే మెలకువతో ఉండాలి కాని నగరంలోని దొంగల గురించి కాదు అని అర్థం.

కామః క్రోధశ్చ లోభా ద్యాః దేహే తిష్టంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ తస్మా జ్జాగ్రత జాగ్రత!

అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే దొంగలు మన శరీరంలోనే ఉన్నారు. వీళ్ళు ప్రతీ వ్యక్తికీ ఉండే జ్ఞానం అనే రత్నాన్ని దొంగతనం చేయాలని పొంచి ఉంటారు. ఆ శరీరంలోని దొంగల విషయంలో జాగ్రత కావాలి కాని ఇళ్ళలో ఉండే వస్తువుల విషయంలో కానే కాదు అని అర్థం.


జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః
సంసార సాగరం దుఃఖం తస్మా జ్జాగ్రత జాగ్రత!


అంటే పుట్టుక బాధ, ముసలితనం బాధ, భార్య బాధ ఇలా అన్నీ బాధలే.ఏడుస్తూనే పుడతాం అలానే ఏడిపిస్తూ కన్నుమూస్తాం. సంసారమనే సాగరం కూడా బాధే ఇన్నిబాధలుండగా దొంగలు పడి పట్టుకెళ్ళిపోయారని బాధ ఏల? అని అర్థం.

ఈ పద్యాలను విన్న భోజుడు మిక్కిలి సంతసించి మరుసటి రోజు ఉదయం ఎక్కువ మొత్తంలో బహుమానాన్ని ఆ బాలునికి బహుకరిస్తాడు. ఆ బాలుడు వెంటనే ఆ బహుమానం తల తల్లికి ఇవ్వగా ఆనందంలో ఉన్న ఆమె భర్త బిడ్డ వద్ద ఏదీ తీసుకోవద్దని చెప్పిన విషయం గుర్తులేక ఆ బహుమానాన్ని అందుకుంటుంది. ఋణం తీరిపోయినందున ఆ బాలుడు వెంటనే అందరి ముందే ప్రాణాలు వదిలేస్తాడు. అందుకే అంటారు ఋణానుబంధ రూపేణాపశు పత్ని సుతాలయాః ఆత్మ జ్ఞానం న జానాతితస్మా జ్జాగ్రత జాగ్రత! ఈ ఋణానుబంధం ఉన్నన్నాల్లే ఏ బంధమయినా నిలుస్తుంది. అదే లేకుండా ఆత్మజ్ఞానం కలిగి భగవంతునిలో ఐక్యం అయితే మనకి ఈ భవ బంధాల నుండి విముక్తి ఉంటుంది. అలా ఉండాలని పరమ నిష్టగా ఉన్న యోగి చెప్పుల వలన దాసుకి ఋణగ్రస్తుడయ్యాడు.

పాదుకలు అంటే చెప్పులు అనే కాక పాదాలు అనే అర్థం కూడా ఉంది. అలా వచ్చినదే పాదుకా సహస్రం. చూశారా చెప్పుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో! ఇవే కాక గత క్రొద్ది సంవత్సరాలుగా బరువుని తగ్గించే చెప్పులు అంటూ బాగా అమ్ముడయ్యాయి మరి అవి ఎంత వరకు అధిక బరువుని తగ్గిస్తాయో తెలియదు కాని మొత్తానికి వ్యాయామానికి కూడా బాగా పనికొస్తున్నాయి(ట). అదండీ చెప్పుల గురించి! వాటి విలువ తెలిసింది కదూ ఇకనించయినా వాటితో జాగ్రత్తగా ఉండండే! కోపమొస్తే కొరుకుతాయి, కరుస్తాయి!

Monday, February 20, 2012

భజన పాట




ఓం కొండదేవరా ..... కోటి వందనాలురా
ఓం జంగమదేవరా ..... నీ భక్తుల బ్రోవరా

చల్లని హిమగిరి పైన కూర్చుని ఉన్నావా
చెల్లని మా బ్రతుకులను చూస్తూ ఉన్నావా
 మాపై ఇంత నిర్దయ ఏలనయ్యా
ఇకనైనా మము కావగ రావయ్యా
మా హృదయాలకు ఇంత వేదనెందుకయ్యా 
ఈ లోకంలో నీకన్నా మాకెవరయ్యా 
మనసా వాచా కర్మణా నిను నమ్మితి కదయ్యా

అందని శిఖరాలపై నిండుగ ఉన్నావా
నీ భక్తుల కాచుట దండుగ అనుకున్నావా
చల్లనయ్యా మా పైన జాలి చూపవయ్యా
చల్లని నీ చూపులతో మమ్ము సాకవయ్యా
నీ చరణాలను కలనైనా విడువనంటిని కదయ్యా
కరుణించి మా కలతలన్నిటినీ బాపవయ్యా
కర్త కర్మ క్రియ నీవేనని నమ్మితి కదయ్యా