Monday, November 26, 2012

కాళిదాసు - మేఘ సందేశం


చిన్నప్పుడు మేఘ సందేశం సినిమా చూసి అదే కాళిదాసు వ్రాసినది అన్న అపోహలో ఉండేదానిని. తరువాత రెండూ వేరు వేరని, ఇదొక విరహ కావ్యం అని తెలిసింది. విరహం నాకెందుకో అంతగా నచ్చదు. కానీ కాళిదాసు విరహ కావ్యం చదివాక విరహంలో కూడా ఇంత అందం, ఆనందం ఉంటాయని తెలుసుకున్నాను. నవరసాలలో మొట్ట మొదటి స్థానం శృంగారానికే దక్కింది కనుక ముందుగా కాళిదాసు శృంగార రచనలని నాకు అర్థమయినంతలో పరిచయం చేస్తున్నాను. ఆ ప్రకారంగా అభిజ్ఞాన శాకుంతలం తరువాత స్థానం మేఘ సందేశానికి ఇచ్చాను. ఈ మేఘ సందేశం ఒక "ఖండ కావ్యం". ఖండ కావ్యం భవేద్కావ్యం ఏక దేశాను సారిచ అన్నారు. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. ఈ మేఘ సందేశంలో పూర్వ మేఘం (63 శ్లోకాలు), ఉత్తర మేఘం (52 శ్లోకాలు) అని రెండే సర్గలు ఉన్నాయి.  
 
కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే  జనక తనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥

అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.

ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.

అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).

పూర్వ మేఘంలో మేఘానికి మార్గ నిర్దేశం చేస్తాడు. ఆ ప్రకారంగా, చిత్రకూట పర్వతం (ప్రస్తుతం దీనిని మధ్యప్రదేశ్ లోని రామ్ గఢ్ అంటారు) మీద బయలుదేరిన మేఘం, మాల పర్వతం (ప్రస్తుతం దీనిని ఛత్తీస్ గఢ్ అంటారు) మీదుగా ఆమ్రకూట పర్వతం (నర్మదా లేదా రేవా నదీ జన్మస్థానం) వెళ్ళి, అక్కడనుండీ దశార్ణ దేశ (మాళవ దేశ పూర్వ భాగాన్ని దశార్ణ దేశం అంటారు) రాజధాని అయినటువంటి విదిశా (ప్రస్తుతం దీనిని భిలాసా అంటారు) నగరానికి వెళ్ళి వేత్రవతీ (వింధ్య పర్వతాలకి ఉత్తర భాగంలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "బేత్ వా" అని పిలుస్తారు) నది అందాలని ఆస్వాదిస్తూ, కొంచెం చుట్టు తిరుగు అయినా ఉజ్జయిని (మాళవ దేశ రాజధాని. దీనినే అవంతి అని కూడా అంటారు) వెళ్ళి తప్పనిసరిగా (కాళిదాసుకి ఆ ఊరి మీదా, శివుని మీదా ఉన్న మమకారంతో ఇది చేర్చాడు అనిపిస్తుంది) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన మహాకాలుని దర్శనం (సాయంకాల సమయంలో) చేసుకుని, శిప్రా (ఉజ్జయినిలో ప్రవహించే నది) నదికి ఉపనదులయిన గంధవతి, గంభీర నదుల వద్ద సేద తీరి, దేవగిరి (ప్రస్తుతం దీనిని దౌలతాబాద్ అంటారు) పర్వతం వద్ద నివాసముండే శరవణభవుడయిన కుమారస్వామిని దర్శించుకుని, అక్కడ ప్రవహించే చర్మణ్వతి (వింధ్య పర్వతాలకి వాయువ్య దిశలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "చంబల్" అని పిలుస్తారు) నదిని దాటుకుంటూ, దశపురం (రంతిదేవుని రాజధాని నగరం), బ్రహ్మావర్తం (సరస్వతీ, దృషద్వతీ నదుల మధ్యన ఉన్న ప్రదేశం), కురుక్షేత్రం (మహా భారత యుద్ధం జరిగిన చోటు), కనఖలం (హరిద్వార్ వద్ద ఉన్న క్షేత్రం, ఇక్కడ గంగానది ప్రవహిస్తుంది), హిమవత్పర్వతం మీదుగా కైలాసం చేరాక, ఆ ప్రక్కనే ఉన్న అలకానగరం (మా అనగా యక్షుల నివాసం) వెళ్ళాలి.

ఉత్తర మేఘంలో అలకానగారాన్ని వివరించి, తన ఇంటికి దారి చెప్పి, తన భార్య గుర్తులు చెప్పి, వారిరువురికి (యక్షునికీ, తన భార్యకీ) మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను చెప్పి (యక్షుని భార్యకి ఈ మేఘుడు నిజంగా యక్షుడు పంపిన వాడే అని నమ్మకం కలిగించటం కోసం), తన గురించి బాధ పడవద్దనీ, తాను త్వరగా వచ్చేస్తానని చెప్పమని మేఘుడిని రకరకాలుగా పొగిడి (తన పని జరగడం కోసం) మరీ పంపిస్తాడు. తీరా చూస్తే, మేఘం ఆ అలకానగరం వెళ్ళేసరికి యక్షుడే తన సంవత్సర కాలం పూర్తి చేసుకుని తన భార్యను చేరుకుంటాడు.

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞాన శాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).

శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 

త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః
ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।
కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥
అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. నాకెందుకో కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  

గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం
రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।
సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥

అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.

తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః ॥

అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవస్రస్త గఙ్గాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ ।
యావః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీ వాభ్ర బృన్దమ్ ॥

ఈ శ్లోకంలో స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక అనే నాయికను ప్రతిబింబిస్తున్నాడు. ఇందులో కైలాస పర్వతాన్ని నాయకుని(ధీర లలితుడు)గా, అలకా నగరాన్ని నాయిక(స్వాధీన పతిక)గా భావించి వర్ణిస్తున్నాడు కవి. స్వాధీన పతికలోని ప్రేమకి, సుగుణాలకి పూర్తిగా వశమయిన ప్రియుడు ఆమెను అనునిత్యం లాలిస్తూ ఉంటాడుట. అలిగిన ప్రేయసిని లాలించే ప్రియుడు ఆమెను తన తొడపై పడుకో పెట్టుకుంటే ఆ స్త్రీ రూపం ఎలా ఉంటుందో, కైలాస పర్వతంపై ఉన్న అలకా నగరం అలా ఉందని కవి భావన! అక్కడ ఆకాశంలో జాలువారే గంగానది ఈ ప్రియురాలు (అలకానగరం) కట్టుకున్న తెల్ల పట్టు చీరలా ఉందిట!

"ఉపమా కాళిదాసస్య, అర్ధాంతరన్యాసోపి విధీయతే" అంటారు. ఈ కావ్యంలో నాకు నచ్చినవి చాలా ఉన్నా, మిక్కిలి ఆకర్షించిన కొన్ని ఉపమానాలు:
ఆమ్రకూట పర్వతాన్నీ, అక్కడ ప్రవహించే రేవా నదినీ వర్ణిస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న పర్వతానికి, పాయలు పాయలుగా ప్రవహిస్తున్న నది ఆ ఏనుగు పెట్టుకున్న విభూది రేఖల వలె ఉన్నది అంటాడు.
మార్గ మధ్యలో కనిపించిన "నిర్వింధ్య" నదిని ఒక స్త్రీగా, మేఘాన్ని తన ప్రియునిగా భావిస్తూ, నదిలో వచ్చే సుడులను ఆ స్త్రీ యొక్క నాభిగా అభివర్ణించడం.
చర్మణ్వతీ నదిని ఆకాశం నుండీ చూస్తే భూదేవి మెడలో ధరించిన ఒంటి పేట ముత్యాల హారంలా కనిపిస్తోంది, ఆ నీటి కోసం నువ్వు (మేఘుడు) వంగితే ఆ ముత్యాల హారం మధ్యలో ఉన్న ఇంద్ర నీలమణిలా ఉంటావు అంటాడు.

ఇటువంటి ఎన్నో అద్భుతమయిన ఉపమానాలతో మనోజ్ఞ సీమకి తీసుకెళ్ళాడు కాళిదాసు. చదువుతున్నంత సేపూ ఆ ప్రదేశాలన్నీ అక్కడే ఉండి చూసినట్టు అనిపిస్తుంది. ఇందులో వ్రాసిన ప్రతీ శ్లోకాన్నీ ఒక చిత్రంగా గీయచ్చు. భావకులు ఆ పారవశ్యం నుండీ తేరుకుని బయటకి రావటం చాలా కష్టం. ఏమి ఉపమానాలు! ఏమి విశేషణాలు! ఎన్ని అలంకారాలు! ఆహా! ఒక మహాద్భుతం చూసిన అనుభూతి దక్కింది. విరహం, తన్మయత్వం, భక్తి, ప్రేమ, అనురాగం, శృంగారం, ప్రకృతి వర్ణనలూ, సందేశాలూ అన్నిటినీ సమపాళ్ళల్లో పండించినటువంటి మేఘ సందేశం ఒక చక్కని కావ్యం అనడంలో అతిశయోక్తి లేదు.  

Friday, October 05, 2012

వాయువు




నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో...

Friday, September 07, 2012

గురుభక్తి


ముందుగా అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు (దొంగలు పడిన ఆరు నెలలకి సామెత కాస్సేపు మర్చిపోండి). మొన్న ఎంతోమంది గురువులకి నమస్కారాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, వారి వారి అభిప్రాయాలను పరి పరి విధముగా తెలియచేసుకున్నారు. చూసి చాలా ఆనందం వేసింది, గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" 
అయితే ఈ శ్లోకం ఎందులోది? ఏ సందర్భంలోది? ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? నాకొచ్చాయిగా! అందుకే ఈ టపా. ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి (ప్రశ్నలేమీ అడగనులెండి).

కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు (ఆయన పేరు నాకు గుర్తులేదు). ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.
ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఈ టపా అంకితం....

గమనిక: గొర్తి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కథ "గురు చరిత్ర"లోని రెండవ అధ్యాయంలోనిదనీ, గురు శిష్యుల పేర్లు వేదధర్ముడు, దీపకుడు అని స్పష్టమవుతున్నది. నేను నేర్చుకున్నది ఇలానే కనుక ఈ టపాలో వివరాలు, పేర్లు మార్చటం లేదు.
 

Tuesday, August 21, 2012

"మా" రుచులు



శీర్షిక చూసి నేను కూడా ఏదో తయారీ విధానం చెప్పబోతున్నాను అని అనుకుంటున్నారా? అలా తొందరపడి నన్ను అపార్థం చేసేసుకుంటే ఎలా? చిన్నప్పుడు ఎవరన్నా నీకు వంట చేయటం వచ్చా అమ్మా? అని అడిగితే ఓహ్! నాకు ఉప్పు, మంచినీళ్ళు, పెరుగు వండటం వచ్చు అని చెప్పేదానిని. చూశారా? చిన్నతనంలోనే ఎన్ని వండటం నేర్చేసుకున్నానో!!! నాకు తెలిసిన వంటలన్నీ చెప్పేస్తే మీరంతా కూడా నేర్చేసుకుని మీకు వచ్చినవి మర్చిపోతారు కనుక ప్రస్తుతానికి నేను చెప్పబోయే వంటకాలు ఎలా ఉంటాయి? ఎక్కడ దొరుకుతాయో మాత్రం పరిచయం చేస్తాను.

కోనసీమ అనగానే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే వంటలు కొన్ని ఉంటాయి. అవే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ కోటయ్య కాజా, మామిడి తాండ్ర, గంగరాజు పాలకోవా, పనసపొట్టు కూర, పులసలు (పుస్తెలు అమ్ముకుని అయినా పులస తినమంటారు), ఇలా ఎన్నో ఎన్నెన్నో. అయితే ఇవి కొనసీమకే పరిమితం కాకుండా ప్రస్తుతం ఇంచుమించు అన్నీ చోట్లా దొరుకుతున్నాయని నా అభిప్రాయం. వాటిని రుచి చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడయినా కొనుక్కోవచ్చును. ఈ టపాలో అంతగా గుర్తింపు లేకపోయినా కోనసీమలో మాత్రం ప్రాముఖ్యతని సంపాదించుకున్న వాటిల్లో నాకు తెలిసిన కొన్ని
వంటలని మీ ముందుకి తెస్తాను.

పూర్వ కాలం నుండీ కోనసీమ అనగానే గుర్తు వచ్చేవి తరవాణీ కుండలు. నిజమే! వేసవి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లోనూ ఈ కుండలు ఉండి తీరాల్సిందే. వార్చిన గంజి నీళ్ళు కుండలో పోసి, మొదటి సారి మాత్రం మజ్జిగ వేసి, నీళ్ళు, ఉప్పు వేసి దబ్బాకు వేసి అన్నం అందులో ఉంచి తరువాతి రోజు దానిని తినేవారు. ఎండ గాడ్పు కొట్టకుండా ఈ తరవాణీ నీళ్ళు తాగితే చాలా చల్లగా ఉంటుంది. 

కాయావకాయ
వేసవి అనగానే అందరూ ఎదురు చూసేది కొత్త ఊరగాయల కోసం. అయితే మా కోనసీమలో మాత్రం ఎక్కువగా ఉండేది కాయావకాయ. కాయలతో కాక పళ్ళతో పెడతారా ఏమిటి? అనుకోకండి. కాయావకాయ అంటే కాయని పూర్తిగా ముక్కలు చేయకుండా ఉన్న పళాన్న పెట్టడం. మాంచి మామిడికాయలు తీసుకుని గుత్తి వంకాయ కూరకి కోసినట్టు మామిడికాయని నాలుగు పక్కల కోసి, జీడి తీసేసి, ఆవపిండి బాగా కుక్కి పెడతారు.  దానిని బాగా ఊరపెట్టి మూడవ రోజున నూనేసి నిలువ ఉంచుతారు. ఆ రోజుల్లో మామిడికాయ మొత్తం ఒక్కరే తినేవారు. తరువాత ఒక కాయ తీస్తే పెద్ద కుటుంబాల్లో అదే అందరికీ సరిపోతోంది. ఎన్నాళ్ళయినా ఆవ ఘాటు తగ్గకుండా భలే రుచిగా ఉంటుందిలెండి.

తరవాణి కుండ అన్నము - ఈ కాయావకాయ మంచి జోడీ.


కొట్టెక్క బుట్టలు
ఇడ్డెన్లు లేదా ఇడ్లీలు అందరూ చేసుకున్నా కోనసీమలో వాటిని ప్రత్యేకంగా చేస్తారు. మామూలు ఇడ్లీలలాగా కాకుండా కొట్టెక్క బుట్టలు లేదా వాసినపోలె రూపాలలో చేస్తారు. ఈ కొట్టెక్క బుట్టలనే పొట్టెక్కలు అని కూడా అంటూ ఉంటారు. పనస ఆకులని బుట్టలుగా చేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఆకుతో సహా ఆవిరిలో ఉడికిస్తారు. వీటిని అంబాజీపేట ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. పోలాల అమావాస్యకి ఇవి ప్రత్యేకంగా చేసి ముత్తయిదువులకి వాయినాలు ఇస్తారు. వేడి వేడిగా తింటే రుచి భలే ఉంటుంది. 
వాసినపోలె
తరువాత వాసినపోలె. వాటిని కొంతమంది ఆవిరి కుడుములు అని కూడా అంటారు. ఇడ్లీ పిండిని గిన్నెకి కట్టిన గుడ్డ లేదా బట్ట మీద వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. బట్ట వాసన పిండికంటి ఒకరకమయిన వాసనతో ఉంటుంది కనుక దాని పేరు వాసినపోలె అనమాట! ఇది ఎక్కువగా విశ్వేశ్వరాయపురం ప్రాంతంలో చేస్తారు.    

బలుసాకు
బలుసు లేని తద్దినం, బులుసు లేని యజ్ఞం ఉండదని నానుడి. మిగతా ప్రాంతాల వాళ్ళు అక్కడక్కడా చేసుకున్నా కోనసీమలో ప్రతీ ఇంట్లో తద్దినానికి ఉండి తీరేది బలుసాకు. పితృ దేవతలకి అదంటే చాలా ఇష్టమట. అందుకనే తద్దినాలకి బలుసాకు పచ్చడి తప్పనిసరిగా ఉండి తీరాలి, ఒకవేళ పచ్చడి చేయలేకపోతే కనీసం చారులో అన్నా శాస్త్రానికి ఒకాకు వేస్తారు.
బొంగు(లో) చికెన్
బొంగు(లో) చికెన్ అనేది రంపచోడవరం ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ వెదురు బొంగులలో దీనిని చేస్తారు కనుక ఆ పేరు వచ్చింది.  ఉప్పు, పసుపు, కారం, మసాలాలు బాగా దట్టించిన పచ్చి కోడి మాంసాన్ని పచ్చటి వెదురు బొంగులలో పెట్టి ఆకులతో అంచులు కట్టేసి నిప్పుల మీద కాలుస్తారు. బొంగులలో ఉడికిన కోడి మాంసం రుచిని ఎంత వర్ణించినా తక్కువే అని జనాల అభిప్రాయం. 

గరాజు
ఇహ, నాకెంతో ఇష్టమయిన దాని గురించి చెప్పబోతున్నాను. అదే గరాజు. రాజులకే రాజు రారాజయితే రారాజులకే రాజు మా గరాజు. సాధారణంగా తీపి తింటే నాలిక మీద ఆ తీపి అలానే ఉంటుంది అంటారు కానీ గరాజులకి మాత్రం వెఱ్ఱి తీపి ఉండదు. వాటిని తయారు చేసే ఏకైక చోటు నగరం. ఆ చుట్టుప్రక్కల ఊళ్ళల్లో కూడా దొరకవు. కేవలం నగరంలో మాత్రమే దొరికే అసలు సిసలయిన కోనసీమ స్వీటు గరాజు. వీటిని చూస్తే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పిచ్చుక గూడు.  గూడు కట్టడానికి పిచ్చుకలు గడ్డిని తెచ్చి ఒక గోడలాగా ఎలా తయారు చేస్తాయో వీటిని కూడా అలానే బియ్యపు పిండితో చేసే ఖారప్పూస లాంటి దానితో చేస్తారు. అందుకే నాలాంటి వాళ్ళు చాలా మంది వీటిని పిచ్చుక గూళ్ళు అని ముద్దుగా పిలుచుకుంటారు. కావాలంటే మీరే చూసి చెప్పండి అలా ఉన్నాయో లేదో!! (నాకు గరాజు చిత్రం కావాలి అనగానే నగరం వెళ్ళి వీటిని కొని మరీ ఈ చిత్రాన్ని పంపిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు)
 
మొక్క గుడ్లు
మా కోనసీమంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేవి మొక్క గుడ్లు. మొక్కలకి గుడ్లు ఉండటం ఏమిటి అనుకుంటున్నారా??? అదే అండీ కొబ్బరి పువ్వునే (కొబ్బరి కాయ లోపల వచ్చే పువ్వు) అలా పిలుచుకుంటారు. మా రాజమండ్రీలో కూడా దేవీ చౌక్ శివాలయం దగ్గర అమ్ముతూ ఉంటారు. పల్లెటూర్లల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని. మా చుట్టాల ఇళ్ళకి వెళితే తోటల్లోంచి బస్తాలతో తెచ్చి ఉంచుతారు మా అందరికోసం. వాటిని తింటే మాత్రం ఒక పువ్వుతో ఎవ్వరూ ఆపలేరు. 
 
నేనెంతో అభిమానించే ఒక బ్లాగరు ఈ మధ్యన నాకు "గోదావరి కథలు" అనే పుస్తకం పంపారు. అవి చదువుతున్న కొద్దీ ఇంటి మీద, ఊరి మీద బెంగ ఎక్కువయిపోతోంది. అదే సమయములో దొంతరలోంచి ఎన్నో జ్ఞాపకాలు బయటకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండే ఎవరికయినా గుర్తొచ్చేది అమ్మ చేతి వంట. అంతే ఇహ వెంటనే కోనసీమ రుచులన్నిటికీ నా
అక్షరాల తాలింపు వేసేసి ఇలా మీ ముందుకి కొన్ని తెచ్చాను. ప్రస్తుతానికి వీటిల్లో ఏవి ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తినాలనుంది చెప్పండి? మీరు రుచి చూసే పూచీ నాది. 

Thursday, August 02, 2012

జ్యోతి



నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో...

Monday, July 09, 2012

గుర్తుకొస్తున్నాయి...


అలా ముఖపుస్తకం (ఫేస్ బుక్) తెరిచానా, చూస్తే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక మెస్సేజ్ ఉన్నాయి. సరే మెస్సేజ్ ముందు చూద్దామని చూశానా ఆశ్చర్యం! నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నిజమా? భ్రమా? తెలియలేదు. మళ్ళీ ఒకసారి కళ్ళు నులుముకుని చూశాను. నిజమే! ఎంత ఆనందమో! మా సంస్కృతం మాష్టారు "ఏరా అమ్మడూ బాగున్నావా తల్లీ? గుర్తున్నానా?" అని పంపారు. డిగ్రీ తరువాత వాళ్ళ ఊరు వెళ్ళి ఆయనని కలిసి రావటమే తప్ప ఎన్నడూ ఫోనులో కాని, మెయిల్ లో కాని మాట్లాడింది లేదు. ఎప్పుడూ దద్దమ్మ, రాక్షసి, దెయ్యం అని పిలిచే ఆయన ఇలా నన్ను సంబోధించటం చూసి ఒక్కక్షణం మనసులోని ఆనందమంతా కళ్ళను దాటి చెక్కిలి మీదకి వచ్చేసింది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా ఆయన పంపినదే. వెంటనే కన్ఫర్మ్ నొక్కేసి, ఆలోచనల్లోకి వెళ్ళిపోయా.

మాష్టారితో పరిచయం డిగ్రీలో జరిగింది. క్లాసుకి వచ్చిన మొదటి రోజే, ఈ క్రింది శ్లోకం (నాకింకా గుర్తు) బోర్డు మీద వ్రాసి ఎవరయినా వివరించగలరా అన్నారు.

పార్థః కర్ణవధాయ త చ్ఛరగణం కృద్ధో రణే సందధౌ
త స్యార్ధేన నివార్య త చ్ఛరగణం మూలై శ్చతుర్భిర్హయాన్
శల్యం షడ్భి ర థేషుభి స్త్రిభి రపి చ్ఛత్రం ధ్వజం కార్ముకం
చిచ్ఛే దాస్య శిర శ్శరేణ కతి తే యా వర్జున స్సందధౌ?
వెంటనే నేను వంద సార్ అన్నాను.
మా: ఎవరా బడుద్ధాయ్?

నేను: నేనే సార్ (లేచి నిలబడుతూ)
మా: నేను శ్లోకాన్ని వివరించమంటే ఏకంగా లెక్క చెప్పేశావే? మంచిది. ఆ మాత్రం చురుకుదనం ఉండాలి. ముక్కున పెడుతున్నారో, మనసు పెడుతున్నారో చూద్దామని సిలబస్లో లేనిది అడిగా. సంతోషం. ఒక్కరన్నా భాషకి విలువిస్తున్నారు. ఇంతకీ ఈ శ్లోకాన్ని బట్టీ నీకేం అర్థమయ్యింది?
నేను: ఇప్పటిలా ఆ కాలంలో భాషలు (ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగు) పరీక్షల ముందు చదివితే, మెయిన్ సబ్జెక్ట్స్ కూడా పాస్ అవ్వము అని.
మా: (నవ్వుతూ) రాక్షసి. అది సరే. ముందు శ్లోకానికి అర్థం చెప్పు?
నేను: శ్లోకాన్ని బట్టీ ఇది కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని వధకు సంబంధించి అర్జునికీ, కర్ణునికీ మధ్యన నడిచిన ఘట్టం అని తెలుస్తోంది. అర్జునుడు వేసిన మొత్తం బాణాలలో సగం బాణాలు కర్ణుడు వేసే బాణాలని ఎదుర్కోవటానికి  పట్టాయి (అంటే ఇక్కడ మొత్తం బాణాలు x అనుకుంటే కర్ణుడి బాణాలను ఎదుర్కోవటానికి x/2 పట్టాయి). అలానే అర్జునుడు మొత్తం వేసిన బాణాల వర్గమూలానికి నాలుగురెట్ల బాణాలు కర్ణుని గుఱ్ఱాలను ఎదుర్కోవటానికి పట్టాయి (అంటే
4x). కర్ణుని రథసారధి అయినటువంటి శల్యుడిని కొట్టడానికి ఆరు, రథం మీది జెండా, కర్ణుని గొడుగు, విల్లుని కొట్టడానికి ఒక్కోదానికీ ఒక్కోటి (6+1+1+1) చొప్పున బాణాలు పట్టాయి. చివరిగా కర్ణుని తల నరకడానికి ఒక బాణం పడితే మొత్తం అర్జునుడు వాడిన బాణాలు ఎన్ని?
మా: భేష్! దీనిని బట్టీ నీకర్థమయిన నీతి ఏమిటి?
నేను: కర్ణుడు ఎంత గొప్పవాడయినా కానీ అధర్మంతో (కౌరవులతో) చేరటం వలన నాశనమయ్యాడు.
మా: నవ్వి, సంతోషం! కానీ పిల్లలూ (అందరినీ ఉద్దేశ్యించి) మన పురాణాలన్నీ కూడా చాలా గొప్పవి. అవి చూసే దృష్టిని బట్టీ ఒకే శ్లోకం ఒక్కో విధంగా అర్థమవుతుంది. తాత్విక దృష్టితో చూస్తే అలా, మీ మీ సబ్జెక్టు పరంగా చూస్తే అలా అర్థమవుతాయి. ఆలోచించి చూడండి ఎప్పుడయినా ఖాళీగా ఉన్నప్పుడు

అని ముగించేసి వెళిపోయారు. అలా ఆయనతో నా మొదటి పరిచయం. ఎంత అల్లరి చేసినా పల్లెత్తు మాట అనకపోగా ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. ఎందుకో ఆ రోజులన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఆ రోజు నుండీ ఈ రోజు దాకా ఆయన చెప్పిన ఆలోచన మాత్రం చేయనే లేదు. ఇవాళ వెంటనే ఆలోచిస్తే తప్పేముంది? అనిపించి అదే శ్లోకంతో మొదలు పెట్టాను.

మొదటగా, అర్థాన్నే మరింత లోతుగా ఆలోచించాను. అసలు కర్ణుడు వేసే బాణాలను ఆపడానికి అర్జునుడంతటి ప్రతిభావంతుడికే యాభై బాణాలు పట్టాయి అంటే అబ్బో! కర్ణుడు ఎంత గొప్ప విలుకాడో కదా! అనిపించింది. అలానే గుఱ్ఱాలకి నలభై బాణాలు వాడవలసి వచ్చింది అంటే వాటికి బాణాలను తప్పించుకునే చాకచక్యమూ, నేర్పరితనమూ తెలుస్తోంది. తరువాత రథ సారధి అయినటువంటి శల్యుడు కేవలం ఆరే ఆరు బాణాలకి లొంగిపోయాడు అంటే అతని పాండవ పక్షపాత బుద్ధి తెలుస్తుంది. కేవలం మూడే బాణాల్లో గొడుగు, జెండా, విల్లు పడిపోవటం కర్ణుని నిస్సహాయతను, అసమర్ధతను తెలియచేస్తోంది. ఒకే ఒక్క బాణంతో కర్ణుని తల తెగి పడటం భారతంలోని కథకు బలం చేకూరుస్తోంది. ఎందుకంటే భారతం ప్రకారం కర్ణుడు తల తెగి పడినవాడే, అలానే ఆఖరి నిమిషంలో నిస్సహాయత కూడా శాపమే కదా!

దీనినే బాగా పరికించి చూస్తే, రాజనీతి కనిపించింది. యుద్ధంలో ముందుగా అవతలి వ్యక్తి వేసే బాణాలను ఎదుర్కోవాలనీ, తరువాత గుఱ్ఱాలని ఎదుర్కోవటం వలన అతను ఎక్కడికీ వెళ్ళలేడనీ, అప్పుడింక పారిపోకుండా రథ సారధిని ఎదుర్కొని ఇతని (మీ రాజు) పని అయిపోయింది అని చెప్పడానికి సూచికగా గొడుగునీ, జండానీ, విల్లునీ కొట్టి, ఇహ శాశ్వతంగా రాజు చిక్కినట్టే కనుక అప్పుడు ఒకే దెబ్బతో కన్నుమూసేలా వధించాలని తెలుస్తుంది. మరి ఇది రాజనీతి రహస్యమే కదా!

ఇంకా లోతుగా ఆలోచించి, ఆధ్యాత్మిక అన్వయం ప్రయత్నించాను. కర్ణుడు వేసిన బాణాలు విషయ వాంఛలు అనుకుందాం. వాటిని ఎదుర్కోవటం చాలా కష్టమయిన పని (అందుకే యాభై బాణాలు పట్టి ఉంటాయి). ఎప్పుడయితే వీటికి దూరంగా ఉంటామో అప్పుడే లక్ష్య సాధన చేకూరుతుంది. బాహ్య భోగాలకి దూరంగా ఉన్నాక ముఖ్యమయినది ఇంద్రియ నిగ్రహణ. గుఱ్ఱాలు ఇంద్రియాలకి ప్రతీకలు కదా. ఈ ప్రకారంగానే అర్జునుడు ముందుగా భోగాలని ఎదుర్కొని ఇంద్రియాలని నియంత్రించాడు (ఇది కూడా కష్టమయిన పనే). ఎప్పుడయితే ఇంద్రియ నిగ్రహణ జరిగిందో, బుద్ధి వశమవుతుంది. ఇక్కడ బుద్ధి అంటే రథ సారధి. ఇవన్నీ నియంత్రించగా మిగిలినవి మనస్సు, చిత్తము, అహంకారము. ఈ మూడూ వరుసగా గొడుగు, జెండా, విల్లు అనమాట. మొత్తం అంతా వశం అయిన తరువాత మిగిలినది జీవుడు (కర్ణుడు). అర్జునుడు ఆత్మ అనుకుంటే, జీవుడు ఆత్మలో చేరాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవే మోక్షానికి అర్హుడు కదా! 

తరువాత అందులో అడిగిన ప్రశ్న. అది గణితానికి సంబంధించినది. ఈ శ్లోకం భాస్కరాచార్యుడు రచించిన లీలావతీ గణితం లోనిది. గణితంలో కాస్తో కూస్తో ప్రవేశం ఉన్న వారెవరికీ కూడా ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వ్రాసిన ఈ ఒక్క గ్రంధం మీదే ఎన్నో పరిశోధనలు జరిగాయి. శ్లోకంలో వచ్చిన అర్థాన్ని ఒక ఈక్వేషన్ రూపంలో మార్చుకుని, తద్వారా లెక్కలను ఎలా చెయ్యాలో తెలిపారు. ప్రస్తుత శ్లోకాన్ని తీసుకుంటే అర్థాన్ని బట్టీ మనకు వచ్చేది x = x/2 + 4x +10. దీనిని ఆధారంగా చేసుకుని x విలువ సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం గణిత విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది.

ఇలా రక రకాలుగా ఆలోచించిన తరువాత ఈ శ్లోకాన్ని సైన్సు పరంగా కూడా ఆలోచిద్దాం అనిపించి ఆ దిశగా శోధించా. రోగ నిరోధక శక్తికి కాస్త అన్వయం కుదిరింది. మన శరీరంలోని కణాలు మొదటగా బయటనుంచి వచ్చే ప్రత్యర్ధులని (బాక్టీరియా, వైరస్, మొ.) ఎదుర్కొని, తరువాత వాని రాకకు ఆధారమయిన వాటిని నిర్జీవం చేసి అప్పుడు చంపేస్తాయి కదా! 

ఇవే కాక, ఇచ్చినది ఒక శ్లోకం కనుక అందులో ఎన్నో వైవిధ్యమయిన సంధులు, సమాసాలు, వ్యాకరణ విశేషాలు కూడా ఉండి ఉండవచ్చు. నాకు అంత బాగా తెలియదు. నా పీత బుఱ్ఱకి ఇతర అన్వయాలేమీ తోచటం లేదు. మీరు మీ సంబంధిత విభాగాలలో ఆలోచించి, మీకు తోచిన అన్వయాలను కూడా అందిస్తే ఇది సంపూర్ణమవుతుంది.